Arun Goel : లోక్సభ ఎన్నికలు బాగా సమీపించాయి. ఇంకో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఈ కీలక తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్(Arun Goel) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కూడా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. అయితే ఆయన రాజీనామాకు గల కారణం తెలియరాలేదు. తన వ్యక్తిగత కారణాలతోనే గోయల్ రాజీనామా చేశారని ఉన్నతాధికారులు చెప్పినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన భద్రతాపరమైన అంశాలపై చర్చించేందుకు ఎన్నికల సంఘం శుక్రవారమే కేంద్ర హోంశాఖ ఆఫీసర్లు, రైల్వే అధికారులతో భేటీ అయింది. ఇదిజరిగిన మరుసటి రోజే(శనివారం) అరుణ్ గోయల్ రాజీనామా చేయడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘంలో ఇప్పటికే ఒక ఖాళీ ఉండగా, అరుణ్ గోయల్ రాజీనామాతో మరో ఖాళీ ఏర్పడింది.
అంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్, కమిషనర్లుగా అనూప్ పాండే, అరుణ్ గోయల్ ఉండేవారు. అనూప్ పాండే పదవీకాలం ఫిబ్రవరి 15న పూర్తయింది. ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. త్వరలోనే తమకు అనుకూలమైనవారిని ఆ పదవుల్లోకి కేంద్ర సర్కారు తీసుకొస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినందున, కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో గణనీయమైన మార్పు అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని పర్యవేక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. హడావుడిగా ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లను నియమించినా ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఎన్నికల నియమనిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి వాటిపై వారికి తక్కువ సమయంలోనే అవగాహన కుదిరి ఈ ప్రక్రియలో పాల్గొనడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join