Site icon HashtagU Telugu

Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు

Mumbai Crime

Mumbai Crime

Heartbreaking Incident : ముంబైలోని ఆరే కాలనీలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలను ఆమె కుటుంబ సభ్యులే చెత్తకుప్పలో పడేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 60 ఏళ్ల యశోద గైక్వాడ్ చర్మ క్యాన్సర్‌తో పాటు మానసికంగా కూడా సతమతమవుతున్నారు. శనివారం ఉదయం ఆరే కాలనీలోని దర్గా రోడ్డులో చెత్తకుప్పలో గాయాలుతో, బలహీనంగా పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

తర్వాత జరిగిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. యశోద గైక్వాడ్‌ స్వయంగా తన మనవడు సాగర్ షెవాలే తనను అక్కడ వదిలేసి వెళ్లాడని చెప్పారు. అయితే ముందుగా సాగర్‌ తాను ఏం చేయలేదని, ఆమె ఇంటినుంచి బయటపడ్డారని చెప్పాడు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత అసలైన నిజం వెలుగు చూసింది. అసలు ఏం జరిగిందంటే, శుక్రవారం రాత్రి యశోద గైక్వాడ్ ఆవేశంతో తన మనవడిపై దాడికి యత్నించడంతో, అతను తన మామ బాబాసాహెబ్ గైక్వాడ్‌తో కలిసి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

కానీ అక్కడ అడ్మిషన్ రాకపోవడంతో, ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సంజయ్ కుడ్షిమ్ సహాయంతో తెల్లవారుజామున ఆమెను చెత్తకుప్పలో వదిలేశారు. ఈ ఘటనపై ముగ్గురు.. సాగర్ షెవాలే, బాబాసాహెబ్ గైక్వాడ్, ఆటో డ్రైవర్ సంజయ్‌పై కేసులు నమోదు అయ్యాయి. యశోద గైక్వాడ్ ప్రస్తుతం కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు తెలిపిన ప్రకారం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఈ దారుణ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్వయంగా స్పందించింది. అంతేకాకుండా, జాతీయ క్యాన్సర్ సంస్థ (నాగ్‌పూర్) యశోద గైక్వాడ్‌కు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించింది.

Congress : పోలింగ్‌ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ