PM Modi Vs Rahul Gandhi : రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేసింది. భాష, మతం పేరుతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలకు చిచ్చు పెట్టే కుట్రను రాహుల్ చేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ కాంగ్రెస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ(PM Modi Vs Rahul Gandhi) ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల్లోగా ఈ నోటీసులపై వివరణ ఇవ్వాలని బీజేపీ, కాంగ్రెస్లకు నోటీసలు జారీ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు ఈ నోటీసులను ఈసీ పంపింది. పార్టీల అగ్రనేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘తమ అభ్యర్థులు ఎన్నికల కోడ్ను అనుసరిస్తున్నారా ? లేదా ? అనే అంశాన్ని పొలిటికల్ పార్టీలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అది రాజకీయ పార్టీల బాధ్యత. ప్రత్యేకించి స్టార్ క్యాంపెయినర్ల విషయంలోనూ రాజకీయ పార్టీలు అలర్ట్గా ఉండాలి. స్టార్ క్యాంపెయినర్ల రేంజులో ఉన్న నాయకులు అభ్యంతరకర ప్రసంగాలు చేయడం వల్ల తీవ్ర పరిణామాలకు దారి తీసే రిస్క్ ఉంటుంది’’ అని కేంద్ర ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది.
గత ఆదివారం రాజస్థాన్లోని బన్స్వారాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన సంపదను చొరబాటుదారులు, పిల్లలు ఎక్కువగా ఉన్నవారికి(ఓ మైనారిటీ వర్గం) ఇవ్వాలని చూస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో ఈ దేశ సంపదపై తొలి హక్కు ముస్లింలదే అని చెప్పారని మోడీ ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలు, బంగారాన్ని కూడా లాక్కుంటుందని వ్యాఖ్యానించారు.