Lok Sabha Polls : లోక్సభ ఎన్నికల ఘట్టానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చింది. ఐదు దశల పోలింగ్తో ముడిపడిన ముఖ్యమైన గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇవాళ రిలీజ్ చేసింది. ఏ విడతలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది కూడా వెల్లడించింది. ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యను మార్చడం అసాధ్యమని ఈసీ స్పష్టం చేసింది. తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఎన్నికల ప్రతి విడతలోనూ పోలింగ్ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ డేటాను ఓటర్ టర్నవుట్ యాప్లో అందుబాటులో ఉంచామని కేంద్ర ఎన్నికల సంఘం(Lok Sabha Polls) తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల ప్రక్రియపై సందేహాల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఆరోపించారు. తాము ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీని గురించి అందరితో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడేందుకు, ఆందోళనలను పరిష్కరించేందుకు ఈసీ నిబద్ధతతో ఉందని తెలిపారు. ‘‘బహుశా ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోవడం, ఓటింగ్ లిస్ట్ తప్పుగా ఉండటం లేదా ఓటర్ల జాబితా తారుమారు కావడం వంటి సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి’’ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా దీని గురించి ప్రస్తావించిందన్నారు. కాగా, శనివారం ఉదయం సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ఓటు వేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.