Sixth Phase Elections : దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆరో విడత పోలింగ్ కోసం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో(Sixth Phase Elections) బిహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో మే 25న పోలింగ్ జరుగుతుంది. బిహార్లో 8, హర్యనాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఆ రోజున ఓటింగ్ జరుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join
ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈరోజు(సోమవారం) నుంచే నామినేషన్లు దాఖలు చేయొచ్చు. ఇక చిట్టచివరివైన ఏడో దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల అవుతాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఓటింగ్ జరిగింది.
మూడో దశ పోలింగ్ ప్రక్రియ మే 7న జరగనుంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 95 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న మొత్తం 1,351 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఆ రోజున తేల్చనున్నారు.మూడో విడతలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకుగానూ 25 చోట్ల పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలోని సూరత్ స్థానానికి మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా.. అక్కడ ఇప్పటికే ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో మే 7న సూరత్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగదు.
మే 7న మూడో విడత ఎన్నికలో భాగంగా గుజరాత్లోని 25 స్థానాలు, కర్ణాటకలోని 14 సీట్లు, ఉత్తరప్రదేశ్లోని 10 సీట్లు, మహారాష్ట్రలోని 11 సీట్లు, మధ్యప్రదేశ్లోని 10 సీట్లు, ఛత్తీస్ గఢ్లోని 7 సీట్లు, బిహార్లోని 5 సీట్లు, అసోం, బెంగాల్లోని చెరో 4 సీట్లు, డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలీలోని 2 సీట్లు, గోవాలోని 2 సీట్లు, కశ్మీర్లోని 1 సీటుకు పోలింగ్ జరగనుంది.