Meghalaya Earthquake : ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం వచ్చింది. ఇవాళ(గురువారం) ఉదయం 11:32 గంటలకు గారో హిల్స్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Also Read :Delhi New CM: ఢిల్లీ నయా సీఎం రేఖా గుప్తా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
భూకంప ప్రభావిత జోన్లో..
భూప్రకంపనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల నుంచి బయటికి పరుగులు తీశారు. అంతకుముందు బుధవారం రాత్రి కూడా మేఘాలయలో స్వల్ప భూకంపం వచ్చింది. కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి మేఘాలయలో(Meghalaya Earthquake) భూకంపం రావడంతో జనం ఉలిక్కిపడ్డారు. మరోవైపు అసోంలోని గౌహతి సహా పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయని తెలిసింది. మన దేశంలోని ఈశాన్య ప్రాంతం మొత్తం భూకంప ప్రభావిత జోన్లో ఉంది. దీనివల్ల అక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హిమాలయాలు సమీపంలోనే ఉండటంతో ఈశాన్య భారతదేశం తరచుగా భూకంపాల బారిన పడుతుంటుంది.
Also Read :Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
ఢిల్లీలో కూడా..
ఫిబ్రవరి 17న తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో కూడా భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆ భూకంప తీవ్రత ఢిల్లీ పరిసరాల్లోని నోయిడా, ఘజియాబాద్లను సైతం తాకింది. జనవరిలో నేపాల్లోని ఖాట్మండులో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం రాగా, దాని ప్రభావం ఢిల్లీలోని పలు ఏరియాల్లోనూ కనిపించింది. ఢిల్లీ కూడా హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే హస్తిన కూడా భూకంపాల రిస్క్ ఉన్న జోన్లో ఉంది. భూమి పైపొర ఒక ఫాల్ట్ లైన్ వద్ద అకస్మాత్తుగా కదలడాన్నే భూకంపం అంటారు. భూమి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా కదులుతున్నప్పుడు వాటి మధ్య ఘర్షణ ఏర్పడటంతో భూకంపం వస్తుంది.