కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీని కుటుంబం పార్టీగా చాలా కాలం నుంచి బీజేపీ భావిస్తోంది. దక్షిణ భారతదేశంలోని టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే, డీఎంకే పార్టీలను ఆయన పరోక్షంగా ఎత్తిపొడిచాడు. ఉత్తర భారతదేశంలోనూ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ ఎస్పీ ఒక్కటే కుటుంబం పార్టీగా ఉంది. మిగిలిన పార్టీల్లో కుటుంబం నుంచి వారసులు వచ్చిన దాఖలాలు తక్కువ.వంశపారంపర్య పార్టీలు రాజ్యాంగం కోసం పనిచేస్తోన్న వాళ్లను ఆందోళన కలిగిస్తున్నాయని మోడీ విమర్శించాడు. పార్లమెంటులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రజాస్వామ్య స్పూర్తిని కుటుంబ పార్టీలు దెబ్బతీస్తున్నాయని ఆరోపించాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజవంశీయ రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని, లేదంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా దేశం నడుచుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందాడు. ఒక పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం నడుపుతుంటే, మొత్తం పార్టీ వ్యవస్థ ఒక కుటుంబంతో ఉంటే…ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అతిపెద్ద సమస్యగా నిలుస్తోందని కాంగ్రెస్ను ఉద్దేశించి మోడీ స్పష్టం చేశాడు. ప్రజాస్వామ్య స్వభావాన్ని రాజకీయ పార్టీలు కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్`లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించడాన్ని తప్పుబట్టాడు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించలేదని, ఓ సంస్థ నిర్వహిస్తోన్న విషయాన్ని మోడీ గుర్తు చేశాడు.