Private Jets : ఇది ఎన్నికల సీజన్. రాజకీయ పార్టీలు కీలకమైన నాయకుల కోసం ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నాయి. దీంతో వాటి అద్దె రేట్లు అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల వాటిని అద్దెకు ఇచ్చే కంపెనీల ఆదాయం 15 నుంచి 20 శాతం మేర పెరిగిపోయింది. చార్టర్డ్ విమాన, హెలికాప్టర్ల సర్వీసులకు గంటలవారీగా ఛార్జీలను వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం ఛార్టర్డ్ విమానానికి గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలు, ట్విన్ ఇంజన్ హెలికాప్టర్కు గంటకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.7 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. మునుపటి ఎన్నికల సీజన్తో పోలిస్తే ఈ రేట్లు చాలా ఎక్కువ.
We’re now on WhatsApp. Click to Join
సాధారణంగానైతే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 80వేల నుంచి రూ.90వేల వరకు రేటు ఉంటుంది. ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు రేటు ఉంటుంది. ఇది ఎన్నికల టైం అయినందున సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లకు(Private Jets) గంటకు ఏకంగా రూ.1.50 లక్షల దాకా రేటును వసూలు చేస్తున్నారు. ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లకు గంటకు రూ. 3.5 లక్షలు తీసుకుంటున్నారు. ఛార్టర్డ్ విమానాల అద్దె రేటు గంటకు రూ. 4.5 లక్షల నుంచి రూ. 5.25 లక్షల మధ్య ఉంది. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లో పైలట్ సహా 7 మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది. ట్విన్ ఇంజన్ హెలికాప్టర్లో 12 మంది కూర్చోవచ్చు.ఉత్తరప్రదేశ్ , పశ్చిమ బెంగాల్, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో విమానాలు, హెలికాప్టర్ల అద్దెలను చెల్లించేందుకు బీజేపీ దాదాపు రూ. 250 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఆ టైంలో ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు రూ.126 కోట్లు మాత్రమే.