తెలంగాణలోని ఆస్పత్రులు రోగులను ఎలా పీల్చి పిప్పి చేస్తారో అందరికీ అనుభవమే. కరోనా సమయంలో లక్షలకు లక్షలు బిల్లు వేసి సామాన్యులను పీక్కుతిన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపిన హాస్పటల్ ఒక్కటి కూడా లేదు. అదేమని ప్రభుత్వం ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ, దుబాయ్ లోని ఓ ఆస్పత్రి తెలంగాణ కార్మికుని పట్ల దయతో ఆలోచించి రూ. 3.4 కోట్ల బిల్లును రద్దు చేసింది. అంతేకాదు, స్వస్థలానికి చేరుకోవడానికి ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసింది. రోగం నయం కావడానికి అయ్యే ఖర్చులను భరాయించడానికి సిద్ధం అయింది. ఇంతకీ ఎవరా కార్మికుడు ఏమా కథ అంటే…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా పగడిపల్లి మండలం సుద్దపల్లి చెందిన 53 ఏళ్ల కోట్ల గంగారెడ్డి దుబాయ్ కి పనుల కోసం వెళ్లాడు. గత ఏడాది డిసెంబర్ 25న అనారోగ్యం బారిన పడ్డారు. దుబాయ్ లోని మెడీ క్లినిక్ ఆస్పత్రిలో గత ఏడాది చేరాడు. పక్షవాతం సంకేతాలను గమనించి అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. హఠాత్తుగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాలు కోమాలోనే ఉండిపోయిన గంగారెడ్డి ఇటీవల కోమా నుంచి స్వల్పంగా బయటకొచ్చాడు.
స్వస్థలానికి పంపాలని డాక్టర్లు నిర్ణయించడంతో గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ రంగంలోకి దిగింది. దుబాయ్ లోని భారత రాయభార కార్యాలయాన్ని సంప్రదించింది. ఆస్పత్రి వర్గాలతో సంప్రదింపులు జరపడంతో 3.4కోట్ల బిల్లును రద్దు చేయడంతో పాటు 4.40లక్షల రూపాయలను ఇండియాకు తరలించడానికి ఎయిర్ అంబులెన్స్ ను అక్కడి మెడీ క్లినిక్ సిటీ ఆస్పత్రి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో గంగారెడ్డి చికిత్స పొందుతున్నాడు.
విదేశాల్లోని ఆస్పత్రుల్లో ఇండియన్ రోగుల పట్ల ఉన్న శ్రద్ధ ఇక్కడ లేకపోవడం అనాగరికం. భారత్ లోని ఆస్పత్రులు ప్రత్యేకించి తెలంగాణ ఆస్పత్రుల దోపిడీ గురించి ఎవరైనా చెబుతారు. వాటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలకు కళ్లెం వేయాల్సిన ప్రభుత్వాలు కళ్లు మూసుకుని ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటితో చేతులు కలుపుతున్నాయి. ఫలితంగా రోగులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మెరుగైన వైద్యం అందించడంలోనూ. ఘోర వైఫల్యం తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంది. కనీసం ఇప్పటికైనా గంగారెడ్డి సంఘటన ప్రభుత్వానికి, తెలంగాణ ఆస్పత్రులను కళ్లు తెరిపిస్తాయో ఆశిద్దాం.