Karnataka Congress : కన్నడ ఎన్నికల కదనంలో ప్రముఖ రాజకీయ నాయకుల వారసులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఇందులోనూ కాంగ్రెస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వారసులు విజయం సాధించగా.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన వారసులు ఓటమి పాలయ్యారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర విజయం సాధించారు. షికారిపుర నియోజక వర్గంలో విజయేంద్ర 53,278 ఓట్లు సాధించగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్.పి.నాగరాజ గౌడ 45,449 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. చిత్తపుర్ నుంచి గెలిచారు. ప్రియాంక్ 81,323 ఓట్లు సాధించగా.. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన మనికంట రాథోడ్ 67,450 ఓట్లు మాత్రమే సాధించారు.
దివంగత ఉమేష్ కట్టి కుమారుడు నిఖిల్ కట్టి.. హుక్కేరి నుంచి గెలుపొందారు. బీజేపీ తరఫున బరిలోకి దిగిన నిఖిల్ 90,351 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ కు చెందిన ఎ.బి.పాటిల్ 54,078 ఓట్లతో సరిపుచ్చుకున్నారు.
జేడీ-ఎస్ అగ్రనేత కుమారస్వామి కుమారుడు, కన్నడ (Karnataka) హీరో నిఖిల్.. రామనగర నుంచి ఓటమిపాలయ్యారు. నిఖిల్ 76,439 ఓట్లు పొందగా.. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్ 87,285 ఓట్లు సాధించారు.
సొరబ్ నియోజక వర్గంలో అన్నపై తమ్ముడు పైచేయి సాధించారు. మాజీ సీఎం బంగారప్ప ఇద్దరు కుమారులు ఒకే నియోజక వర్గం (సొరబ్) నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తమ్ముడు మధు బంగారప్ప 98,912 ఓట్లు సాధించగా.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అన్న కుమార్ బంగారప్ప 54,650 ఓట్లు మాత్రమే సంపాదించారు.
Also Read: CONGRESS SUCCESS SECRET : కాంగ్రెస్ ను గెలిపించిన “5”.. ఏమిటది ?