CBI Notice : డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 11:33 AM IST

కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ (DK Shivakumar) కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్‌ (Jaihind Channel)లో డీకే పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. చానల్‌లో పెట్టిన పెట్టుబడులు, లాభాలు, షేర్ల వివరాలను ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. జైహింద్ చానల్‌లో శివకుమార్‌తోపాటు మరో 30 మంది పెట్టుబడులు పెట్టినట్లు చానల్ ఎండీ బీఎస్ శిజు ఇప్పటికే స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే తనకు జై హింద్‌ ఛానల్‌లో వాటా ఉందని 2017-18 ఎన్నికల్లో దాఖలు చేసిన ప్రమాణ పత్రం, ఆస్తి వివరాలలో డీకే శివ కుమార్ ప్రకటించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకే శివ కుమార్‌పై కేసు పెట్టిన అప్పటి బీజేపీ ప్రభుత్వం.. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. అయితే గతేడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నవంబరు 20 వ తేదీన నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఆ కేసు విచారణ కోసం సీబీఐకి ఇచ్చిన అనుమతిని సిద్ధరామయ్య కేబినెట్ రద్దు చేసింది.

అయితే ఆ కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ నేత బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌.. హైకోర్టులో సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తనకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పందించారు. తాను జై హింద్‌ ఛానల్‌లో రహస్యంగా పెట్టుబడులు పెట్టలేదని డీకే శివకుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. త్వరలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తనపై ఒత్తిడిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు.

Read Also : KTR: జిహెచ్ఎంసీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా : కేటీఆర్