Site icon HashtagU Telugu

Divya Deshmukh : ఫిడే మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌

Divya Deshmukh

Divya Deshmukh

Divya Deshmukh : భారత యువ చతురంగ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ (19) ప్రపంచ చెస్‌ రంగంలో చరిత్ర సృష్టించారు. ఫిడే (FIDE) మహిళల వరల్డ్ కప్‌ 2025 ఫైనల్లో అనుభవజ్ఞ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ (Koneru Humpy)పై అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో జరిగిన తొలి ర్యాపిడ్‌ టైబ్రేకర్‌ గేమ్‌ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌లో దివ్య 75 ఎత్తుల పోరాటం తర్వాత విజయం సాధించారు.

చివరి టైబ్రేకర్‌లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగారు. ఆమె ధైర్యం, వ్యూహాత్మకత గేమ్‌ను ఆధిపత్యంలోకి తెచ్చింది. ఈ టోర్నీలో ఫైనల్స్‌కి చేరిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన దివ్య ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. మొత్తం ఫైనల్‌లో దివ్య 1.5 పాయింట్లు సాధించగా, హంపీ 0.5 పాయింట్లతో పరిమితమయ్యారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హంపీ బలమైన పోటీ ఇచ్చినా, తుది గేమ్‌లో దివ్య ఆత్మవిశ్వాసంతో గెలుపు సాధించారు.

ఈ అద్భుత విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్‌ హోదాను సంపాదించారు. దీంతో ఆమె భారతదేశంలో 88వ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు. ఇది మహిళా చెస్‌ చరిత్రలో అరుదైన ఘనత.

మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్‌ (Viswanathan Anand) దివ్య విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. “ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు అభినందనలు దివ్య. ఇది ఉక్కంఠభరితమైన పోరు. హంపీ కూడా అద్భుతమైన పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారు. భారత చదరంగానికి గర్వకారణం ఇది” అని ఆనంద్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నాగపుర్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్‌ తక్కువ అనుభవం ఉన్నప్పటికీ అంతర్జాతీయ చెస్‌లో అసాధారణ ప్రతిభను చూపుతున్నారు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్‌ (IM) హోదా అందుకున్న ఆమె, 2023లో ఆసియా ఛాంపియన్‌గా నిలిచారు. మూడు ఒలింపియాడ్‌ బంగారు పతకాలు ఆమె సొంతం. గతేడాది తొలిసారి 2500 ఎలో రేటింగ్‌ దాటారు.

తాజాగా వరల్డ్ కప్‌లో ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి రేటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లను ఓడించి తన శక్తిని నిరూపించారు. సెమీఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ జాగ్‌పై విజయం సాధించడం ఆమెను తుది ఫైనల్‌లో గెలుపు వైపు నడిపింది.

గత మూడు రోజులుగా దివ్య దేశ్‌ముఖ్‌ – కోనేరు హంపీ మ్యాచ్‌ వార్తలు గూగుల్ ట్రెండ్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు దివ్య విజేతగా నిలవడంతో, ఆమె పేరు సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.

Nagababu : వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడంలేదు