Dera Chief : ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ నగరం సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు ఊరటనిచ్చేలా పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. డేరా సచ్చా సౌదా సంస్థ నిర్వహించే ఆశ్రమం మేనేజర్గా వ్యవహరించిన రంజిత్ సింగ్ మర్డర్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మరో నలుగురిని కూడా నిర్దోషులుగా అనౌన్స్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాలతో కూడిన బెంచ్ ఈమేరకు తీర్పు ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
ఓ యువతిపై అత్యాచారం కేసు, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా పేర్కొంటూ సీబీఐ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టులో డేరా బాబా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. రంజిత్ సింగ్ హత్యకేసులో ఆయన్ని నిర్దోషిగా పేర్కొన్న న్యాయస్థానం.. జర్నలిస్టు ఛత్రపతి హత్య కేసులో మాత్రం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Dera Chief) అనుచరుడైన రంజిత్ సింగ్ 2002లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. డేరా బాబా ఆశ్రమం వేదికగా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఓ అపరిచిత వ్యక్తి రాసిన లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ లేఖను ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్ రాసి ఉండొచ్చని గుర్మీత్ రామ్ రహీమ్ అనుమా నించారు. దీంతో రంజిత్ను కడతేర్చేందుకు డేరాబాబా కుట్ర పన్నారని సీబీఐ తమ ఛార్జిషీట్లో పేర్కొంది. ఆశ్రమంలోనే ఇద్దరు యువతులపై డేరా బాబా రేప్ చేశారని సీబీఐ విచారణలో తేలింది. దీంతో కోర్టు తీర్పు మేరకు డేరాబాబా 2017లో సునారియా జైలుకు వెళ్లారు. ఆ కేసులో అప్పట్లో సీబీఐ ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. రంజిత్ సింగ్ మర్డర్ కేసులో డేరా బాబా పాత్ర లేదని, ఆయన నిర్దోషి అని హైకోర్టు స్పష్టం చేసింది.