గత ఏడాది జరిగిన నేరాలు, ఘోరాల చిట్టాను జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. మెట్రో పాలిటిన్ నగరాల్లో అత్యధికంగా నేరాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్టు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా ఢిల్లీ నగరంలోనే నమోదు అయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో జరిగిన నేరాల జాబితాను ప్రకటించారు. ఢిల్లీ తరువాత అత్యధికంగా నేరాలు జరిగిన నగరంగా బెంగుళూరు నమోదు అయింది. ఆ తరువాత స్థానంలో చెన్నై, ముంబాయ్, సూరత్, కోల్ కతా ఉన్నాయి. మొత్తం నేరాల్లో 40 శాతం రేప్ కేసులు, 25శాతం మర్డర్ కేసులు ఉన్నాయి. గత ఏడాది 19 నగరాల్లో మొత్తంగా 1849 హత్యలు, 2,553 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా 461 హత్యలు ఢిల్లీలోనూ, 179 బెంగుళూరు, 15 చెన్నై, ముంబై 148, సూరత్ 116, కోల్ కతాలో 53 హత్య లు జరిగాయి. భారత్ లాకౌ డౌన్ కారణంగా 2019 కంటే 2020లో అత్యాచారాలు, హత్యలు 8.3శాతం తగ్గినట్టు రికార్డ్స్ చెబుతున్నాయి. మెట్రో పాలిటన్ సిటీల్లో మొత్తం 2,533 అత్యాచారాలు జరిగాయి. 967 మందిపై ఢిల్లీలో అత్యాచారం జరిగింది. ఆ తరువాత జైపూర్లో 409, ముంబాయ్ 322 అత్యాచారాలు జరిగినట్టు వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వాళ్లపై 95శాతం అత్యాచారాలు జరిగాయని తేల్చింది. మహిళలపై జరిగిన వివిధ రకాల నేరాలు 35,331 నమోదు అయ్యాయి. ఇవి 2019 కంటే 21.1శాతం తక్కువగా రికార్డ్స్ చెబుతున్నాయి. మహిళలపై జరిగిన వివిధ నేరాల్లో భర్త, బంధువులకు సంబంధించినవి 30.2శాతం ఉన్నాయి. 19.7శాతం కేసులు మహిళలను అవమానించినవిగా గుర్తించారు. కిడ్నాప్ కేసులు 19శాతం ఉంటే 7.2శాతం అత్యాచారం కేసులు నమోదు అయినట్టు విశదీకరించింది. కరోనా కారణంగా ఇళ్లలో ఉన్నప్పటికీ మహిళలపై అత్యాచారం, హత్య కేసులు పెద్దగా తగ్గలేదు. స్వల్పంగా 2019 కంటే తగ్గినట్టు జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.