Brij Bhushan – Evidence : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. ఆయనపై చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తజికిస్థాన్లో ఓ ఈవెంట్ కు వెళ్లిన టైంలో మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. తాను చేసేది తప్పు అని తెలిసినా బ్రిజ్ భూషణ్ సింగ్ పదేపదే అదే తప్పు చేశారని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. ఆయన అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను వేధించారని న్యాయస్థానానికి వివరించారు.
‘‘తజికిస్థాన్లో బ్రిజ్ భూషణ్ నుంచి వేధింపులను ఎదుర్కొన్నానని ఒక మహిళా రెజ్లర్ మాతో చెప్పారు. తన గదికి పిలిపించుకుని బ్రిజ్ భూషణ్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నారనే ఆరోపణ ఉంది. దీనిపై బ్రిజ్ భూషణ్ ను ప్రశ్నిస్తే ఓ తండ్రిగా అలా చేశానని చెప్పాడు. తనకు తప్పుడు ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. బాధితురాలు వెంటనే స్పందించిందా లేదా అన్నది విషయం కాదు. ఆమెను వేధించారా ? లేదా ? అన్నదే అవసరమైన విషయం’’ అని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. తజికిస్థాన్ టూర్ లో ఉండగానే.. బలవంతంగా ఓ మహిళా రెజ్లర్ షర్ట్ ను పైకి లేపి పొట్టను బ్రిజ్ భూషణ్ తాకాడని పోలీసులు చెప్పారు.ఆయా రెజ్లర్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ దోషిగా తేలితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని ఢిల్లీ పోలీసు వర్గాలు (Brij Bhushan – Evidence) అంటున్నాయి. అక్టోబర్ 7న మరోసారి ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారించనుంది.