Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఈరోజు నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. 17వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 18న నామినేషన్ల పరిశీలన, 20 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇక ఫిబ్రవరి 5వ తేదీన 70అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వెల్లడించింది.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 83.49 లక్షల మగ, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఐదోసారి ఓటింగ్లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారు. ముఖ్యమైన యువ ఓటర్లు (20-29) సంఖ్య 25.89 లక్షలుగా ఉన్నట్లు ఈసీ తెలిపింది.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మిగిలిన 41 స్థానాలకు శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈక్రమంలోనే ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా , కోర్ ఢిల్లీ గ్రూప్ నేతలతో సమావేశమవుతారు. ఈ భేటి జేపీ నడ్డా నివాసంలో జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నేతలంతా ఈ భేటీకి హాజరవుతారు. ఈ రోజు రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
Read Also: Hyderabad Cyber Crime Police: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. 23 మంది అరెస్ట్