ఆగ్రాలోని సిక్రాంద్ర ప్రాంతంలోని ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. బైన్పూర్ గ్రామంలో పెళ్లికి సిద్ధమవుతున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరు మహిళలు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని మదన్ కుమార్ తన కుమారుడి బరాత్ (పెళ్లి ఊరేగింపు) బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా వంటగదిలో ఉంచిన సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో కూరగాయలు కోస్తున్న షీలా , మీనా అనే ఇద్దరు మహిళలు మంటల్లో కాలిపోగా, ఆహారం తయారు చేస్తున్న వంట మనిషికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఇద్దరు మహిళలను రక్షించలేకపోయారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. షీలా, మీనా మృతదేహాలను శవపరీక్షకు పంపగా, వంట మనిషి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
సిక్రాంద్ర పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ.. సిలిండర్ పేలుడుతో వివాహ సన్నాహాలు జరుగుతున్న ఇంట్లో మంటలు చెలరేగినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈఘటనలో వంట పని చేస్తున్న ఇద్దరు మహిళలు మరణించారని.. గాయపడిన వంట మనిషి చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సిలిండర్ వాల్వ్ పిన్ తెగిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సిలిండర్కు సమీపంలో ఉన్న వారు పిన్ను బిగించి, వాల్వ్ను సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుండగా, చాలా గ్యాస్ లీక్ అయింది, ఫలితంగా భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఏసీపీ తెలిపారు.