Site icon HashtagU Telugu

ED Custody: ఈడీ కస్టడీకి సంజయ్‌ రౌత్

Sanjay Rauth

Sanjay Rauth

పాత్రాచాల్ భూకుంభకోణంలో అరెస్ట్ అయిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ను ముంబై స్పెషల్‌ కోర్టు ఆగస్టు 4 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించింది. సంజయ్ రౌత్ హార్ట్ పేషెంట్ అని కస్టడీ అప్పగిస్తే ఆరోగ్య సమస్యలు రావచ్చని ఆయన తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన దర్యాప్తు అధికారులు ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకూ సంజయ్‌ రౌత్‌ను విచారిస్తామని చెప్పారు. ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్య లాయర్ ఆయన్ను కలవచ్చని పేర్కొన్నారు. మహా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన పత్రాచల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి.. సంజయ్‌ రౌత్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినా సంజయ్‌ రౌత్‌ స్పందించకపోవడంతో.. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆదివారం ఆయన ఇంటికెళ్లి ఈడీ అధికారులు సోదాలు చేశారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళారు. విచారణకు సహకరించడం లేదంటూ అదుపులోకి తీసుకుని కస్టడీకి కోరుతూ సోమవారం కోర్టులో హాజరుపరిచింది. కాగా సంజయ్ రౌత్ అరెస్ట్ నేపథ్యంలో.. కోర్టు, ఈడీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది సంజయ్ రౌత్ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలు.. ఈడీ కార్యాలయం, కోర్టుకు భారీగా తరలివెళ్లి నిరసన తెలిపారు