Gandhis Contest : ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాల నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారు ? గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎన్నికల బరిలోకి దిగుతారా ? అనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన వయనాడ్తో పాటు అమేథీ నుంచి కూడా పోటీ చేశారు. అమేథీలో ఓడిపోగా.. వయనాడ్లో గెలిచారు. ఈసారి కూడా అదే విధమైన రాజకీయ వ్యూహాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తారా ? లేదంటే .. కేవలం వయనాడ్ స్థానానికే ఆయన పరిమితం అవుతారా ? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని.. తన తల్లి సుదీర్ఘకాలం పార్లమెంటుకు ఎన్నికైన రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపైనా ఇంకా అధికారికమైన స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కీలక ప్రకటన చేశారు. అదేంటో చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాల నుంచి గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని భావిస్తున్నట్టు యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు. ఈ స్థానాల్లో రాహుల్, ప్రియాంకా గాంధీలు బరిలోకి దిగుతారనే నమ్మకం ఉందని చెప్పారు. ‘‘రాహుల్, ప్రియాంకలు అమేథీ, రాయ్బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనేది పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక. అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ఆయన కామెంట్ చేశారు. పార్టీ కార్యకర్తల డిమాండ్ను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు.
రాయ్బరేలీ, అమేథీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గత ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ గెలవగా, అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా సోనియా ఈసారి ఎంపీగా పోటీ చేయబోనని తెలిపారు. దీంతో ఈ రెండు సెగ్మెంట్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇక్కడి నుంచి గాంధీ కుటుంబ సభ్యులే(Gandhis Contest) పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ‘ప్రియాంకా గాంధీ జీ రాయ్ బరేలీ పిలుస్తోంది’ అనే పోస్టర్లను సైతం వేశారు. ఈ ఎన్నికల్లో యూపీలోని 17స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.