హరియాణా ఎన్నికల (Haryana Elections) కోసం కాంగ్రెస్ పూర్తిస్థాయి మ్యానిఫెస్టో (Congress Manifesto) ను శనివారం ప్రకటించింది. ఇటీవల కాంగ్రెస్ ఉచిత హామీలను (Free guarantees) ప్రకటిస్తూ అధికారం దక్కించుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక, తెలంగాణ లో అదే విధంగా ఉచిత హామీలను ప్రకటించి అధికారం దక్కించుకుంది. ఇక ఇప్పుడు హరియాణా లో కూడా అదే విధంగా ఉచితాలను నమ్ముకొని బరిలోకి దిగబోతుంది.
ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 736 మంది అన్నదాతలకు అమరుల హోదా కల్పిస్తామని హామీ ప్రకటించింది కాంగ్రెస్. అమరులైన రైతుల కుటుంబాలకు చెందిన ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, అన్నదాతల సమస్యలపై అధ్యయనానికి రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే రైతు డీజిల్ కార్డులను జారీ చేసి.. వాటి ద్వారా సన్నకారు రైతులకు డీజిల్ కొనుగోలుపై రాయితీలను అందిస్తామని పేర్కొంది.
హర్యానా నుంచి సైన్యంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాలకు రూ.2 కోట్ల సాయాన్ని అందించడం తో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం, వారి పిల్లల చదువుకు ఆర్థికసాయం అందిస్తామని పేర్కొంది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు ప్రతీ కుటుంబం నుంచి 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు కలిగిన ఒక మహిళకు రూ.2వేల ఆర్థికసాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతినెలా రూ.6వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించింది. పేద కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపింది. హర్యానాలో 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. మద్దతు ధరకు చట్టబద్ధత సహా రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తామంది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఓబీసీలకు రూ. 10 లక్షలకు క్రిమీలేయర్ పెంచుతామని హామీ ఇచ్చింది. మరి ఈ ఉచిత హామీలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.
Read Also : Bhagat Singh Birth Anniversary : ‘వారు నన్ను చంపగలరు, కానీ నా ఆలోచనలను కాదు’