కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ నుంచి పలువురు ఆశావాహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించినప్పటికి ఆయన్న రేసు నుంచి అధిష్టానం తప్పించింది. అయితే మొదటి నుంచి అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లో పోటీలో ఉన్నారు. తాజాగా గెహ్లాట్ తప్పుకున్న తరువాత మరో సీనియర్ నేత పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు నామినేషన్కు చివరి రోజు కావడంతో ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు. అంతకుముందు గురువారం అర్థరాత్రి మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్తో సహా G-23 నాయకులు ఆనంద్ శర్మ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరిగిన వివరాలను వారు వెల్లడించలేదు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని గురువారం ప్రకటించిన తర్వాత, మధ్యప్రదేశ్లోని రాజకీయ పరిశీలకులు మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ , శశిథరూర్ పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్కు మద్దతుగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఏకమైనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దిగ్విజయ సింగ్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నామినేషన్ ఫారం తీసుకుని, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వీరంతా దిగ్విజయ్ సింగ్కు మద్దతుగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరి అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు ఉంటారో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.