Prashant Kishore : ఫేక్ న్యూస్ ఎవరినీ వదలడం లేదు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా దాని బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో సర్క్యులేట్ కాగా.. అది నిజమేనేమో అని భావించి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ షేర్ చేశారు. ఇది చూసిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘తామంతా అబద్ధపు ప్రచారాల బాధితులమని కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ తరుచూ చెప్పుకుంటారు. అలాంటిది మీరే ఇప్పుడు ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. సీనియర్ నేత జైరాం రమేశ్ నకిలీ వార్తను ఎలా సర్క్యులేట్ చేస్తున్నారో మీరే చూడండి’’ అని ఆ పోస్టులో ‘జన్ సురాజ్’ పార్టీ ప్రశ్నించింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసులను సైతం ట్యాగ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందన రావాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join
ఇక వాట్సాప్లో జైరాం రమేశ్ షేర్ చేసిన పోస్టు విషయానికి వస్తే.. అందులో బీజేపీ లెటర్హెడ్లా డిజైన్ ఉంది. ప్రశాంత్ కిషోర్ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా జేపీ నడ్డా నియమించారనే అంశాన్ని లెటర్ హెడ్లో ప్రస్తావించారు. నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆ లెటర్పై సంతకం చేసినట్లు కూడా ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్తున్న తరుణంలో.. ఈ ఫేక్ వార్త తెరపైకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఎన్నికల ఫలితాలపై ఇటీవల ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ వ్యూహమో.. ప్రతిపక్షాల బలహీనతో తెలియట్లేదు. కానీ బీజేపీ తన లక్ష్యాన్ని 272 నుంచి 370కి పెంచుకుంది. ఇది కచ్చితంగా బీజేపీకి కలిసి రావచ్చు. అందుకే మోడీ ఓడిపోతారని ఎవరూ చెప్పడం లేదు. వాళ్లకు 370 సీట్లు రాకపోవచ్చని మాత్రమే ప్రతిపక్షాల నేతలు అంటున్నారు’’ అని పీకే కామెంట్ చేశారు.