ఒక పురుషుడు, ఒక మహిళ దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదంటూ సుప్రీం కోర్టు సోమవారం సూచించింది. ఈ సహ జీవన బంధాన్ని ఎవరైనా సవాల్ చేయవచ్చని పేర్కొంది. అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత.. ఇలా సవాల్ చేసిన వారిపైనే ఉంటుందని వెల్లడించింది.
ఇలా సుదీర్ఘ కాలం సహజీవనం చేసిన జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. ఇలాంటిదే ఒక కేసును 2009లో కేరళ హైకోర్టు కొట్టేసింది. సుదీర్ఘ కాలం సహజీవనం చేసిన ఒక జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా దక్కదంటూ నాడు కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ కేసులో తుది డిక్రీ జారీ ప్రక్రియను ట్రయల్ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిక్రీ ఇచ్చిన వెంటనే తుది డిక్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది.