మన దేశంలో చిరుత పులుల సంఖ్యను పెంచేందుకు మరో ప్రయత్నం మొదలైంది.నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మన ఇండియాకు 25 చిరుత పులులు రానున్నాయి. తొలి విడతగా సెప్టెంబర్ 17వ తేదీన 8 చిరుత పులులు ఇండియా కు చేరుతాయి. మధ్యప్రదేశ్లోని కునో పాల్పూర్ నేషనల్ పార్క్లో వీటిని చేర్చబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పులులను కేఎన్పీ పార్క్లో చేర్చుతారు.సెప్టెంబర్ 17న జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్లు తెలిపారు. శియోపూర్ జిల్లాలో నిర్మించిన ఎన్క్లోజర్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చిరుత పులులను వదిలిపెడతారని చెప్పారు.
ఆఫ్రికా నుంచి చిరుతల పునరుత్పత్తి కోసం దేశంలో చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. చిరుతల తరలింపు కోసం అటవీ ప్రాంతంలో 7 హెలీప్యాడ్లను కూడా నిర్మించారు.చిరుతలను హెలికాప్టర్లలో తరలించనున్నారు. తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న షియోపూర్ జిల్లా ప్రజలకు సహాయ పడకుండా విదేశీ చిరుతపులుల పునరుత్పత్తి పేరిట ప్రాజెక్టు చేపడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ విమర్శించారు.ముందు పిల్లలకు పౌష్టికాహారం అందించిన తర్వాతే చిరుతపులుల ప్రాజెక్టు అమలు చేయాలని కమల్ నాథ్ డిమాండ్ చేశారు.