Census : మనదేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది (2025 సంవత్సరం) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనగణనలో భాగంగా దేశ ప్రజల వివరాలను సేకరించే ప్రక్రియ 2026 వరకు కొనసాగనుంది. జనగణన పూర్తయిన తర్వాత లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో, అత్యంత పారదర్శకంగా జనగణన సర్వే జరుగుతుందని చెప్పాయి. కులగణన చేయాలని ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్జేపీ సహా పలు మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల డిమాండ్ను నెరవేర్చే దిశగా ఈసారి జనగణన సర్వే షీట్లో(Census) కులం అనే కేటగిరినీ చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
Also Read :Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత
- ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహించే సంప్రదాయం మనదేశంలో ఉంది.
- వాస్తవానికి 2021లోనే జనగణన జరగాలి. కానీ కరోనా సంక్షోభం వంటి వివిధ కారణాల వల్ల గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.
- రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు, అమలుకు, నిధుల కేటాయింపునకు జనగణనలోని సమాచారమే ప్రాతిపదికగా ఉంటుంది.
- ఈ ఏడాది ఏప్రిల్లో జనాభా విషయంలో చైనాను భారత్ దాటేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటన విడుదల చేసింది.
- భారత జనాభా ఎంత అనే దానిపై అధికారిక క్లారిటీ ఈసారి జరగబోయే జనగణన ప్రక్రియ తర్వాత వస్తుంది.
- ప్రస్తుతం మన దేశ జనాభా 144 కోట్లు ఉందని అంచనా వేస్తున్నారు.
- ఇప్పుడు మన దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు 2011 నాటి జనగణన నివేదికనే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. దాని ఆధారంగానే అన్ని ప్రభుత్వ స్కీంలకు అంచనాలను రూపొందిస్తున్నారు.
- గత తొమ్మిదేళ్లలో మనదేశంలోని 25 కోట్ల మంది ప్రజానీకం పేదరికపు వలయం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ అంటోంది. అయితే దీనిపైనా జనగణన తర్వాతే క్లారిటీ వస్తుంది.