Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు. కనీసం ప్రతీ పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ప్రామాణికం. అయితే 2021లో మళ్లీ చేపట్టాల్సిన జనాభా లెక్కలు.. కరోనా తదితర కారణాలతో వాయిదాపడ్డాయి. అయితే అదే టైంలో ప్రజలు ఇళ్లలో ఉండటాన్ని అనుకూలంగా భావించి.. అమెరికా, రష్యా, యూకే, బ్రెజిల్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు జనాభా లెక్కల కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్గా నిర్వహించాయి. కానీ మనం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోయాం. ఇక ఈసారి జనగణనకు భారత సర్కారు గట్టి ముహూర్తాన్ని ఖరారు చేయనుందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత మనదేశంలో జనగణన జరుగుతుందని సమాచారం. అందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లోనూ జనగణన కార్యక్రమం నిర్వహణకు నిధులు కూడా కేటాయించారు. జనాభా లెక్కల సేకరణ కోసం దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. 12నెలలపాటు జనగణన(Population Census) ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- మన దేశంలో తొలిసారిగా బ్రిటీష్ హయాంలో 1881లో జనగణనను నిర్వహించారు.
- అప్పటినుంచి ప్రతి పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
- రెండు ప్రపంచ యుద్ధాలు.. చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు జరిగిన టైంలో కూడా మన దేశంలో జనాభా లెక్కల సేకరణ ఆగలేదు.
- 2011లో చివరిసారి జనగణన నిర్వహించారు.
- జనగణన చట్టం ప్రకారం చేపట్టే ఈ ప్రక్రియ వల్ల పదేళ్లలో దేశ జనాభా ఎంతమేర పెరిగిందో తెలుస్తుంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన సమాచారమే ఆధారంగా నిలుస్తుంది.
- 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం.. ఇప్పటికీ రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల కనీసం 10 కోట్ల మంది అర్హులకు సంక్షేమ పథకాలు అందట్లేదు అని విశ్లేషకులు చెబుతున్నారు.
- ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల రూపకల్పనకు 2011 నాటి జనగణన లెక్కలనే ఆధారంగా తీసుకుంటున్నాయి. దీనివల్ల పెరిగిపోయిన జనసంఖ్యకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరగట్లేదు.
- గత తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న ఇటీవల నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై విమర్శలు వెల్లువెత్తాయి. సరైన జనగణన సమాచారం లేకుండా పేదరికాన్ని ఎలా మదింపు చేశారనే ప్రశ్నలు తలెత్తాయి.
- ఈసారి కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలనే డిమాండ్లు వస్తున్నాయి.
- గతేడాది ఏప్రిల్లో జనాభాపరంగా చైనాను భారత్ అధిగమించింది. దీంతో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటన చేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లకు పైమాటే.