అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశంలో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ భరోసా ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ సరఫరాపై ఎటువంటి టెన్షన్ అవసరం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ప్రపంచవ్యాప్తంగా ఏవైనా భౌగోళిక రాజకీయ మార్పులు లేదా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నా, రాబోయే 60 రోజులకు (రెండు నెలలు) దేశంలోని ప్రతి పౌరుడి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు మన వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, మరో రెండు నెలలకు సరిపడా ముడి చమురు (Crude Oil) ఇప్పటికే భారత్కు చేరుకునే మార్గంలో ఉందని, కాబట్టి వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఎల్పీజీ సరఫరాలో నిరంతరాయం.. భారీగా దిగుమతులు
వంటగ్యాస్ (LPG) కొరతపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది. అమెరికా (US), రష్యా, ఆస్ట్రేలియా (AUS) వంటి ఇతర మిత్ర దేశాల నుండి సుమారు 8,00,000 టన్నుల ఎల్పీజీ భారత్కు వస్తోందని వెల్లడించింది. ఇప్పటికే కొన్ని భారీ నౌకలు భారత తీరానికి చేరుకోగా, మరికొన్ని మార్గమధ్యలో ఉన్నాయి. ఈ భారీ నిల్వల కారణంగా వచ్చే నెల రోజుల వరకు దేశంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, గృహ వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఇంధన శాఖ వివరించింది.
కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు
ప్రభుత్వ వద్ద సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని కేంద్రం కోరింది. కొందరు స్వార్థపరులు కృత్రిమ కొరతను సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయించే అవకాశం ఉన్నందున, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇంధన భద్రత విషయంలో భారత్ అత్యంత పటిష్టమైన వ్యూహంతో ఉందని, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు ఉన్నప్పటికీ మన దేశానికి అవసరమైన చమురు, గ్యాస్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
