Sheikh Hasina Attacks Boycott India Campaigners: బంగ్లాదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను యాంటీ-ఇండియా ఉద్యమం వైపుగా రెచ్చగొడుతున్నాయి. ‘బాయ్కాట్ ఇండియా’ అంటూ నినాదాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు చెందిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ గెలుపొందిన విషయం తెలిసిందే.
ఆ పార్టీ గెలవడం వరుసగా నాలుగోసారి. ఆ ఎన్నికల్లో హసీనా గెలవడానికి భారత్ సాయం చేసిందంటూ బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో భారత ఉత్పత్తులను కొనకూడదని బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
హసీనాపై వ్యతిరేకతను పెంచేలా సామాజిక మాధ్యమాల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. కొన్ని నెలలుగా దీనిపై మౌనం వహిస్తున్న షేక్ హసీనా తాజాగా స్పందిస్తూ.. యాంటీ-ఇండియా ఉద్యమకారులకు గట్టిగా బుద్ధి చెప్పేలా కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతల భార్యల వద్ద ఎన్ని భారతీయ చీరలు ఉన్నాయని షేక్ హసీనా ప్రశ్నించారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు ఇండియా ఉత్పత్తులను కొనకూడదని అంటున్నారని, మరి వారి భార్యలకు ఈ విషయం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. వాళ్ల పార్టీ ఆఫీసు ముందు వాళ్ల భార్యల భారతీయ చీరలను తగులబెడితే.. వారు చేస్తున్న ఉద్యమానికి వారు నిజంగానే కట్టుబడి ఉన్నట్లని అన్నారు.
అధికారంలో ఉన్న సమయంలోనూ ఆ పార్టీ నేతల భార్యలు ఇండియా నుంచి చీరలు తెప్పించుకుని బంగ్లాదేశ్ లో అమ్మేవారని హసీనా చెప్పారు. ఇండియా నుంచి గరం మసాలా, ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి అనేక వస్తువులను దిగుమతి చేస్తున్నామని అన్నారు. ఆ పార్టీ నాయకులు భారతీయ మసాలాలు లేకుండా వంటలు చేసుకోవాలని కదా? అని అన్నారు.