Site icon HashtagU Telugu

Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

British officials inspect Tihar Jail.. Will they extradite Nirav Modi and Mallya to India..?!

British officials inspect Tihar Jail.. Will they extradite Nirav Modi and Mallya to India..?!

Delhi : వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి రప్పించేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి హై-ప్రొఫైల్ నిందితుల అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో విదేశాల నుంచి అప్పగింత ద్వారా వచ్చే నేరగాళ్ల కోసం ప్రత్యేక హై-సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యూకే అధికారులకు ప్రతిపాదించింది. అంతేకాక, వారి భద్రతకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, మానవ హక్కులకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Read Also: ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

ఈ నేపథ్యంలో యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS)కి చెందిన ప్రతినిధి బృందం ఇటీవల తీహార్ జైలును సందర్శించింది. అక్కడి హై-సెక్యూరిటీ వార్డును తిలకించి, ఖైదీలకు అందుతున్న వసతులను పరిశీలించింది. అందులో భాగంగా కొందరు ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడినట్లు సమాచారం. గతంలో యూకే కోర్టులు భారత జైళ్లలోని పరిస్థితులపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మానవ హక్కుల ఉల్లంఘన, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి అంశాలను చూపించి, అప్పగింత అభ్యర్థనలను తిరస్కరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ అడ్డంకులను అధిగమించడమే భారత తాజా ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశ్యం.

భారత ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా తీహార్ జైలులో ‘ప్రత్యేక ఎన్‌క్లేవ్‌’ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇది అంతర్జాతీయ నేరగాళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్న మొదటి విభాగంగా నిలవనుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సుమారు 178 అప్పగింత అభ్యర్థనలను వివిధ దేశాలకు పంపింది. వాటిలో యూకేలోనే సుమారు 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విజయ్ మాల్యా కేసు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13,800 కోట్ల మోసంతో సంచలనం సృష్టించిన నీరవ్ మోదీ కేసు అత్యంత ప్రాధాన్యం పొందినవి.

విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి యూకేకు పారిపోయాడు. అలాగే నీరవ్ మోదీ అనేక నకిలీ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ల (LOUs) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇద్దరి అప్పగింతకు యూకే కోర్టులు ఇప్పటికే అనుమతినిచ్చినా, కొన్ని న్యాయపరమైన ప్రాసెసుల వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. భారత ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న చర్యలు, ప్రత్యేక జైలు విభాగ నిర్మాణం వంటి పద్ధతుల ద్వారా, యూకే కోర్టులకు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కల్పించేందుకు యత్నిస్తోంది. దీనివల్ల తిరస్కరణలకు అవకాశం తగ్గి, అప్పగింత ప్రక్రియ వేగంగా ముందుకుసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also:AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!