Site icon HashtagU Telugu

Bomb threats : ఢిల్లీలో 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు

Bomb threats to over 50 schools in Delhi

Bomb threats to over 50 schools in Delhi

Bomb threats : ఢిల్లీ నగరం మరోసారి బాంబు బెదిరింపులతో కలవరపడుతోంది. ఈ రోజు ఉదయం దాదాపు 50కి పైగా పాఠశాలలకు కొందరు దుండగులు ఈ- మెయిల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిళ్లు భయాందోళనకు కారణమయ్యాయి. ఇప్పటికీ ఈ ఘటనల వెనుక ఉన్న వ్యక్తుల వివరాలు తెలియకపోవడం, మళ్లీ మళ్లీ స్కూళ్లు లక్ష్యంగా బెదిరింపులు జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు ఉదయం 7:40 గంటల సమయంలో మాలవీయ నగర్ ప్రాంతంలోని గవర్నమెంట్ ఎస్కేవీ బాలికల పాఠశాలకు మొదటి ఈమెయిల్ వచ్చింది. ఆ వెంటనే, 7:42కి ప్రసాద్ నగర్‌లోని ఆంధ్రా స్కూల్‌కు కూడా ఇదే రకమైన బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు విభాగాలు, బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పాఠశాలల పరిసరాలను ఖాళీ చేసి, విద్యార్థులు మరియు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం పాఠశాల ఆవరణాల్లో విశ్లేషణాత్మకంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ ..టెర్రరైజర్స్‌ 111గా పేర్కొనే ఓ గ్రూప్‌ పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు బెదిరింపు మెయిల్స్‌ పంపించినట్లు తెలిపారు. స్కూళ్లలోని కంప్యూటర్‌లు, కెమెరాలు అన్నీ ప్రస్తుతం తమ అధీనంలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో 25,000 బిలియన్‌ డాలర్లు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. లేదంటే 48 గంటల్లో బాంబు పేల్చేస్తామని బెదిరించినట్లు వెల్లడించారు. మెయిల్స్‌ విషయాన్ని పోలీసులకు చెప్తే.. బాంబు పేల్చేయడంతో పాటు స్కూళ్లకు సంబంధించిన డేటాను లీక్‌ చేస్తామని హెచ్చరించారన్నారు. కాగా.. ఇదే గ్రూప్‌ ఇటీవల 5వేల బిలియన్‌ డాలర్ల కోసం ఇలాంటి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం ప్రతి చిన్న సంకేతాన్నీ పరిశీలిస్తున్నాం. విద్యార్థుల భద్రత మాకు అత్యంత ప్రాముఖ్యం. ఇలాంటి బెదిరింపులకు లోనయ్యేలా స్కూళ్లను నిర్లక్ష్యం చేయలేము. వాటిపై పూర్తిగా దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు. ఇలాంటి బెదిరింపులు ఢిల్లీలో కొత్తేమీ కావు. కేవలం రెండు రోజుల క్రితమే ద్వారకాలోని డీపీఎస్ పాఠశాలకు వచ్చిన బాంబు కాల్‌ కూడా బూటకమని తేలింది. ఆ సమయంలోనూ పోలీసులు అలర్ట్ అయి బృహత్తర తనిఖీలు నిర్వహించారు. అయినా, అప్పుడు కూడా ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. గత నెలలో జరిగిన మరొక ఘటనలో ఏకంగా 50కి పైగా స్కూళ్లకు ఒకేసారి బెదిరింపు ఈమెయిళ్లు రావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ సమయంలో చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు మారిన నేపథ్యంలో, తల్లిదండ్రుల్లో కలిగిన భయం అంతా ఇంతా కాదు.

ఈ తరహా బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈమెయిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ సర్వర్లు ఉపయోగించారు? ఎవరి హస్తం ఉంది అనే విషయాలపై వారు సాంకేతిక విచారణ చేపట్టారు. ప్రస్తుతం వరకు అందిన సమాచారం ప్రకారం, ఈమెయిళ్లు ఒకే విధమైన టెంప్లేట్‌తో ఉండటంతో ఒకే ముఠా ఉన్న అవకాశంపై అధికారులు దృష్టి సారించారు. అయితే, ఇప్పటి వరకు వాటిని ఎవరు పంపారన్నది స్పష్టతకు రాలేదు. ఇదిలా ఉండగా, అధికారులు ప్రజలను శాంతంగా ఉండాలని, అధికారులపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భద్రత కోసం మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అవాస్తవ సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండండి అని తెలిపారు. ఈ వరుస బెదిరింపులతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. విద్యాసంస్థల్లో భద్రతా చర్యలు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం నెలకొంది.

Read Also: Attack : ఢిల్లీలో ఊహించని ఘటన..సీఎం రేఖా గుప్తాపై దాడి..!

Exit mobile version