Gunpowder Factory Blast : భారీ పేలుడుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతెరా జిల్లా బోర్సి గ్రామంలో ఉన్న గన్ పౌడర్ తయారీ పరిశ్రమ దద్దరిల్లింది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడగా హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు., సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్వయంగా బెమెతెరా జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
పేలుడు చాలా శక్తివంతంగా సంభవించింది. దీని శబ్దానికి భయపడి, భూకంపంగా భావించి పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడు కారణంగా పరిసర ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో స్థానికంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఫ్యాక్టరీ నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
పేలుడు సంభవించిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు దాదాపు 17 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం రాయ్పూర్ ఎయిమ్స్కు తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
ఇటీవల మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో సంభవించిన పేలుడులో తొమ్మిది మంది చనిపోగా, 60 మంది గాయపడ్డారు. ఈనెల 16న హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. కర్మాగారాల్లో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం, సాంకేతిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కార్మికుల విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇలా ప్రమాదాల్లో చనిపోయే కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందుతున్న దాఖలాలు కూడా చాలా తక్కువ.