Mallikarjuna Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని మోడీ సర్కార్, ఆర్ఎస్ఎస్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చే ఉద్దేశం నరేంద్రమోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగ నిర్మాతకు శత్రువులని కీలక వ్యాఖ్యలు చేశారు.
మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై గౌరవం మాటలకే పరిమితం. ఆయన ఆశయాలను నెరవెర్చే ఉద్దేశం వారికి లేదు. ఆయన వారసత్వంపై పెదవి విరుస్తున్నారు. 1952 ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి ఎస్ ఏ డాంగే, వీడీ సావర్కర్లు కారణం. ఈ విషయాన్ని అంబేడ్కర్ ఓ లేఖలో పేర్కొన్నారు అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఏఐసీసీ సమావేశంలో సామాజిక న్యాయానికి సంబంధించిన అభిప్రాయాలను ముందుకు తీసుకెళుతున్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం విధానాలను రూపొందిస్తోంది. కానీ, 2021 జనాభా లెక్కల గురించి ఇంతవరకు జాడ లేదు. సాధారణ జనాభా లెక్కలతో పాటు ఏ విభాగంలో ఎంత పురోగతి సాధించామో తెలుసుకోవడానికి కులగణన ఉపయోగపడుతుంది. అందుకే కాంగ్రెస్ తన డిమాండ్ వినిపిస్తోంది అని అన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన అవసరాన్ని ఖర్గే నొక్కి చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని అన్నారు. రాజ్యాంగం.. పౌరులకు అంబేడ్కర్ ఇచ్చిన బహుమతి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పొందే హక్కును కల్పిస్తుందన్నారు.
Read Also: Balanagar Road Accident : ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ కు యువకుడు బలి