Akhilesh Yadav : తమ కంపెనీ కరోనా వ్యాక్సిన్ వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన మాట నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో దానిపై అంతటా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయ నాయకులు కూడా స్పందించడం మొదలుపెట్టారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి విరాళాలను సేకరించడం కోసమే ప్రజల ప్రాణాలను బీజేపీ పణంగా పెట్టిందని ఆరోపించారు. ప్రాణాంతక వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడం అంటే.. ఎవరినైనా హత్య చేయడానికి కుట్రపన్నడంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారని అఖిలేష్(Akhilesh Yadav) చెప్పారు. ‘కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీ, పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి బీజేపీ కమీషన్లు పుచ్చుకుంది. అందుకే ఆ టీకాను ప్రజలకు బలవంతంగా వేశారు. బీజేపీని ప్రజలు ఇక క్షమించబోరు ’’ అని ఆయన కామెంట్ చేశారు. ఈమేరకు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా స్పందించారు. ఇదేనా మోడీ హామీ అని ప్రశ్నించారు. మోడీ దేశ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
ఆస్ట్రాజెనెకా కంపెనీ కరోనా వ్యాక్సిన్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తాయని స్వయంగా ఆస్ట్రాజెనెకా ఇటీవలే బ్రిటన్లోని ఓ కోర్టుకు తెలిపింది.ఈ టీకాను మన దేశంలో ‘కొవిషీల్డ్’ పేరుతో ప్రజలకు అందించారు. అందుకే ఈ వ్యవహారంతో మన దేశ ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. ఈనేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనెకా పూర్తి వివరణతో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. తమ కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.మనుషులు, ఎలుకలు, కోతులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.