Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఆపరేషన్ కమలంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కమలం పార్టీ రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. కర్ణాటకలో రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసింది. ఈ డబ్బుతోపాటు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చింది’ అని సిద్ధరామయ్య ఆరోపించారు.
అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోందని సిద్ధరామయ్య అన్నారు. అయితే అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టిన ధనవంతులు ప్రతిపక్ష పార్టీల్లోనే ఉన్నారా..? బీజేపీలో ఎవరూ లేరా..? అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ చేపట్టిందని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా డబ్బు ఆశ చూపుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? ఇదంతా నల్ల డబ్బు కాదా..? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.