రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. పాలిటిక్స్ లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే… పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి ఒడ్డెక్కితే చాలు అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గెలుపు అందుకోడానికే ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో, భారీ ఆధిక్యంతో గెలుపే తమ లక్ష్యమని కమళనాధులు చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్గా భావిస్తున్న యూపీ శాసనసభ ఎన్నికల్లో భారీ ఆధిక్యం అన్నది బీజేపీ కి అంత అవసరంగా మారింది. దీనికి కారణం ఏంటంటే… జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సంవత్సరంలోనే జరిగే రాజ్యసభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలే. సెంట్రల్ లో వరుసగా రెండోసారి మరింత మెజారిటీతో మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం ఏర్పాటు కావడంతో… ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానిదే కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కమళం పార్టీకి ప్రాణవాయువుగా మారింది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడమే సవాలుగా మారగా.. పంజాబ్లో తాము గెలిచినా, ఓడినా తమ ప్రత్యర్థి కాంగ్రెస్ను గద్దె దించితే చాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే వారికి పెద్ద విజయం కూడా. కానీ ఏదీ బీజేపీ అగ్రనేతలు అనుకున్నంత సులభం మాత్రం కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
*అప్పుడేమో మోదీ వేవ్.. ఇప్పుడేమో మారిన సీన్.. *
భారతీయ జనతా పార్టీకి సంబంధించి చెప్పుకుంటే… అటల్ బిహార్ వాజ్పేయ్, ఎల్ కె అద్వానీల తర్వాత అంతటి జనాధారణ పొందిన నేత ఎవరైనా ఉన్నారంటే అది మాత్రం నరేంద్ర మోదీనే. ఇక 2014 నుంచి దేశంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల వెనుక ప్రధాన కారణం నరేంద్ర మోదీ వేవ్ అనే చెప్పాలి. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సాధించిన భారీ విజయాలు ఆ వేవ్ ఫలితమే. అప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ముఖం మాత్రం మోదీదే. కానీ ఇప్పుడు మాత్రం ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖాలు మారాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాలతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రులెవరూ తమదైన మార్కు చాటుకోలేకపోయినా, యూపీలో యోగి ఆరంభం నుంచే తన మార్కును ప్రదర్శిస్తూ వచ్చారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే మాఫియా డాన్ లు, క్రిమినల్ గ్యాంగులను వరుసపెట్టి ఎన్కౌంటర్లు చేస్తూ.. ఎన్కౌంటర్ రాజ్ గా యోగీ పేరు తెచ్చుకున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఈ ముఖాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఐదేళ్ల ప్రభుత్వ నివేదిక కార్డును కూడా ఓటర్లు పరిశీలిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగికి సంబంధించి చూసుకుంటే… అభివృద్ధి, పనితీరు గురించి పెద్దగా విమర్శలు లేకున్నా.. వ్యవహారశైలి పై మాత్రం విమర్శలు ఎదుర్కొన్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు పెద్ద నేతలు పార్టీని వీడడంతో అది యోగికి పెద్ద సవాల్ గా మారింది. ముఖ్యంగా ఓబీసీ వర్గం, కొంత వరకు బ్రాహ్మణ నేతలు యోగి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2017లో సాధించిన భారీ విజయంలో ఈ రెండు వర్గాల భాగస్వామ్యమే అత్యంత కీలకం. నాయకులు పార్టీలు మారడానికి వ్యక్తిగత కారణాల ఉన్నప్పటికీ, ఈ వలసల ప్రభావం ఎన్నికలపై ఉండబోదని చెప్పడానికి మాత్రం వీల్లేదు. ఈ పరిణామాల నడుమ గెలుపు అంత సులభం కాదని బీజేపీ పెద్దలకు అర్థమవుతోంది. ఎలాగైనా సరే అక్కడ తప్పకుండా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో వారున్నారు. అది ఎంతమేరక్ సక్సెస్ అవుతుందో అనేదీ వేచి చూడాలి.
గెలుపుకంటే… మెజారిటీనే ముఖ్యం..
యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా మరియు పంజాబ్ రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డ కొద్ది రోజుల్లోనే మొదట రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం కొన్నాళ్ళకు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేల సంఖ్య అనేది చాలా కీలకం. అధికార భారతీయ జనతా పార్టీకి ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే, రాజ్యసభ ఎన్నికల్లో అన్ని ఎక్కువ సీట్లు సాధించగలుగుతుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎలక్ట్రోరల్ కాలేజిలో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యే కీలకం. పైగా 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు టీఆర్ఎస్, బీజేడీ పార్టీలు మద్ధతిచ్చాయి. యూపీఏ మిత్రపక్షాలు మినహా తటస్థ పార్టీలన్నీ ఎన్డీయే అభ్యర్థికి మద్ధతివ్వడంతో గెలుపు సునాయాసమైంది. గతంలో మద్ధతిచ్చిన టీఆర్ఎస్ సహా పలు తటస్థ రాజకీయ పార్టీలు ఈసారి మద్ధతిచ్చే అవకాశం కనిపించడంలేదు. అందుకు కారాణాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్ లో సొంత బలం పుష్కలంగా ఉంటే తప్ప గెలుపు అంత సులభం కాదు. అందుకే 403 ఎమ్మెల్యే స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపు అనేది బీజేపీకి అంత కీలకంగా మారింది. కేవలం అత్తెసరు ఆధిక్యంతో గెలిస్తే చాలదు, గతంలో మాదిరి సాధించిన భారీ మెజార్టీ సాధించినప్పుడే తదుపరి జరిగే ఎన్నికల్లోనూ ఆధిక్యతను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అనుకుంటున్నంత మెజార్టీ సాధించడం అనేది అంత సులభం కాదనేది తల పండిన మేధావులు చెప్తున్న మాట. మరి ఐదు రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉంటాయో…. ఎవరి ఆశలు నెరవేరుతాయో… ఎవరి ఆశలు అడియాశలు అవుతాయో చూడాలి.