April 14th – Big Plan : లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఈనెల 14న బీజేపీ విడుదల చేయనుంది. మేనిఫెస్టోలోని అంశాలు చాలా ముఖ్యమైనవి అనే మాట నిజమే !! అయితే ఈ మేనిఫెస్టో విడుదలకు బీజేపీ ఎంపిక చేసిన తేదీ కూడా చాలా స్పెషల్ ! ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
We’re now on WhatsApp. Click to Join
ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉంది. అదే సమయంలో నవరాత్రుల పవిత్ర దినాలు కూడా జరగనున్నాయి. అందుకే ఆ తేదీని బీజేపీ ప్రత్యేకంగా పరిగణిస్తోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా జరిగింది. దీంతో అంబేద్కర్ అంటే తమకు ఎంత గౌరవమో చాటి చెప్పేందుకు, రాజ్యాంగానికి ఎటువంటి ముప్పు లేదనే సంకేతాన్ని దేశ ప్రజల్లోకి పంపేందుకు ఏప్రిల్ 14వ తేదీన బీజేపీ మేనిఫెస్టోను(April 14th – Big Plan) విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేనిఫెస్టో జనరంజకంగా ఉంటుందని, లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు తమకు దోహదం చేస్తుందని కమలదళం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ 19 నుంచి తొలి దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడుదలవుతున్న బీజేపీ మేనిఫెస్టో రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మంది సభ్యులతో బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. అనేక సమావేశాలు, చాలా పెద్దస్థాయిలో మేధోమధనం తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ నాయకులు రెడీ చేశారు. ఈక్రమంలో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలను తీసుకున్నారు. లక్షన్నర మందికి పైగా వీడియో ద్వారా బీజేపీకి సూచనలను పంపించారు. నమో యాప్ ద్వారా 40వేలకుపైగా సూచనలు కమలదళానికి అందాయి.