Bill Gates : బిల్గేట్స్.. అపర కుబేరుడు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సింప్లిసిటీకి మారుపేరు. ఎంత సంపద ఉన్నా.. అందరితో అణకువగా ఉంటారాయన. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తన మనసును బిల్ గేట్స్ చాటుకుంటున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ (Bill Gates) కార్యక్రమాల గురించి యావత్ ప్రపంచానికి బాగా తెలుసు. ప్రత్యేకించి ఇండియాతో ఆయనకు చాలా ఎటాచ్మెంట్ ఉంది. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని మా మంగళ బస్తీలో ఉన్న బిజూ ఆదర్శ్ కాలనీని బిల్గేట్స్ సందర్శించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి బస్తీలోకి వెళ్లిన బిల్ గేట్స్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మురికివాడ ప్రజల యోగక్షేమాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులతోనూ గేట్స్ సంభాషించారు.
We’re now on WhatsApp. Click to Join
ఈసందర్భంగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ డెవలప్మెంట్ కమిషనర్ అను గార్గ్ మాట్లాడుతూ.. ‘‘మురికివాడల ప్రజలకు భూమిపై హక్కులు, కుళాయి నీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయం కల్పించాం. ఆ వివరాల గురించి బిల్ గేట్స్ ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చాం. స్లమ్ ఏరియాను మోడల్ కాలనీగా మార్చడం పట్ల బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు’’ అని చెప్పారు.
ఒడిశా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జి మతి వతనన్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో బిల్గేట్స్ ఆప్యాయంగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు’’ అని తెలిపారు. ‘‘మేం ఇంతకుముందు ఎలా జీవించేవాళ్లం. ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అనేది బిల్ గేట్స్కు వివరించాం. మా ప్రస్తుత జీవన స్థితి గురించి బిల్ గేట్స్ అడిగారు’’ అని గేట్స్తో మాట్లాడిన ఓ స్థానికుడు తెలిపారు. ఒడిశా పర్యటనలో భాగంగా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో బిల్ గేట్స్ భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న తీరుపై సమీక్షించనున్నారు.