ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ మార్గాల్లో (డొమెస్టిక్ రూట్స్) విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానుంది. ఈవిషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విటర్ వేదికగా తెలిపారు. విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టు యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రయాణ సమయాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలని ఆదేశించారు.
ఎందుకు.. ఏమిటి ?
విమాన ఛార్జీల పై పరిమితులను తొలగించాలనే నిర్ణయాన్ని కేంద్రం ఎందుకు తీసుకుంది ? అంటే.. ఇందుకు సమాధానం ఉంది. విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్ ప్రాతిపదికన ఈ నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేసింది. పౌరవిమానయాన రంగంలో స్థిరీకరణ చేసే క్రమంలోనే ఈ నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. రానున్న రోజుల్లో దేశీయ విమానయాన రంగం మరింత వృద్ధి సాధించేందుకు తాజా నిర్ణయం రెక్కలు తొడుగుతుందని పరిశీలకులు విశ్లేషణ చేస్తున్నారు.
కొవిడ్ టైం లో..
కొవిడ్ కారణంగా రెండు నెలలు.. లాక్డౌన్ తర్వాత 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి మొదలు పెట్టారు. ఆ సమయంలోనే దేశీయ మార్గాల్లో ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను విధించారు. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచకుండా చూడటం ద్వారా ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ సమయాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. 40 నిమిషాల్లోపు వ్యవధి ఉండే ప్రయాణాలకు రూ.2,900-8800 (జీఎస్టీ మినహాయించి) ఛార్జీ నిర్ణయించారు. ఇప్పుడు పరిస్థితి మారింది. విమానయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
After review of the current status of Scheduled Domestic Operations viz-a-viz passenger demand for air travel, it has been decided to remove the fare bands notified from time to time regarding the airfares with effect from 31.08.2022. pic.twitter.com/SnLUcW7Rjr
— MoCA_GoI (@MoCA_GoI) August 10, 2022
ఇంధన ధరల భారంతో..
విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2019-20 లో ఏటీఎఫ్ ధర కిలో లీటరుకు రూ. 53,000. ఇప్పుడు ఇది రూ. 1.20 లక్షలు. కొవిడ్ మునుపటి సమయంతో పోలిస్తే ఈ ధర రెట్టింపు కావడంతో విమాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఛార్జీలపై పరిమితులు ఎత్తివేయడంతో ఎయిర్లైన్లు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు.. టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించుకునేందుకు అవకాశం ఏర్పడింది.
The decision to remove air fare caps has been taken after careful analysis of daily demand and prices of air turbine fuel. Stabilisation has set in & we are certain that the sector is poised for growth in domestic traffic in the near future. https://t.co/qxinNNxYyu
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 10, 2022