Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీపావళి పండుగ వేళ ఢిల్లీలో బాణసంచాపై ఉన్న నిషేధాన్ని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వర్కర్లందరికీ కేజ్రీవాల్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాణసంచాపై ఆంక్షలు ఏ మతానికి సంబంధించినది కావని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమని అన్నారు. దీపావళి అనేది మౌలికంగా దీపాలను వెలిగించే పండుగని, బాణసంచా వల్ల వచ్చే కాలుష్యం ముఖ్యంగా పిల్లల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బుధవారం నాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు.
పండుగ ప్రధాన స్ఫూర్తి దీపకాంతులను వెదజల్లడమే కానీ, పొగను వ్యాపింపజేయడం కాదని, ఇది హిందూ, ముస్లింలకు సంబంధించిన అంశంకాదని, కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యం విషయానికి వచ్చినప్పుడు సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ”సుప్రీంకోర్టు, హైకోర్టు సైతం కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచా కాల్చరాదని, దీపాలు వెలిగించాలని చెప్పాయి. దీపావళి అంటే దీపాల పండుగే కానీ బాణసంచా కాల్చడం కాదు. మనం ఎవరి కోసమే కాదు, మనకోసం, మన కుటుంబం మేలు కోసం బాణసంచాకు దూరంగా ఉండాలి. కాలుష్యం ఏ తరహాలో ఉన్నా దాని వల్ల మన పిల్లలే బాధితులవుతారు. ఇందులో హిందూ-ముస్లింలనే మాట లేదు. ప్రతి ఒక్కరి జీవితం విలువైనది” అని కేజ్రీవాల్ చెప్పారు.
ఇక, వర్కర్లందరికీ ఈ నెలాఖరులోపే జీతం, దీపావళి బోనస్ అందుతున్నారు. పారిశుధ్య కార్మికులు నెలాఖరుకు ముందే వేతనాలు అందుకోవడం గత 18 ఏళ్లలో ఇదే మొదటిసారని అన్నారు. ఇంతకుముందు 7-8 నెలలు వరకు జీతాలు ఆగిపోయేవని, ఇప్పుడు నెలాఖరుకు ముందే వేతనాలు అందుకుంటున్నారని చెప్పారు.