Site icon HashtagU Telugu

Atal Bihari Vajpayee : వాజ్‌పేయి స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ వీడియో సందేశం

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆదర్శప్రాయ జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా తనలో కొత్త స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వాజ్‌పేయి యావత్ జీవితాన్ని దేశ నిర్మాణం కోసం త్యాగం చేశారని పేర్కొన్నారు. భారతమాత పట్ల ఆయన అంకితభావం, సేవాభావం అందరికీ స్ఫూర్తి మంత్రాన్ని పంచుతాయని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోమవారం ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ స్మారకాన్ని సందర్శించి, మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా  ‘సదైవ్ అటల్’ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తన వాయిస్‌ఓవర్‌తో  అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత విశేషాల ఫొటోలతో ఒక వీడియోను రిలీజ్ చేశారు. దేశసేవ కోసం జీవితాంతం శ్రమించిన నేతగా వాజ్‌పేయిని అభివర్ణించారు. “హాస్య చతురత వాజ్‌పేయి సొంతం. ఏదైనా విషయంలో హాస్య కోణాన్ని వెలికితీయగల సామర్థ్యం ఆయనకు ప్రత్యేకం. బీజేపీ మీటింగ్స్ లోపల ఏవైనా అంశాలపై చర్చతో వాతావరణం వేడెక్కితే.. మొత్తం వాతావరణాన్ని తేలికపరిచే ఒక జోక్‌ను వాజ్‌పేయి పేల్చేవారు. రాజకీయాలు, పాలనకు సంబంధించిన ప్రతి అంశంపై ఆయనకు గొప్ప అవగాహన ఉండేది” అని ప్రధానమంత్రి మోడీ తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించారు. ఆర్యసమాజ్ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. వాజ్‌పేయి 1990వ దశకంలో ఆరేళ్లపాటు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1996లో 13 రోజుల పాటు, 1998 నుంచి 1999 వరకు 13 నెలల పాటు వాజ్‌పేయి ప్రధానమంత్రిగా సేవలందించారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం ఆయన పీఎంగా పనిచేశారు.