దేశంలో హత్యలు, అత్యాచాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మర్డర్ కేసు సంచలనం రేపుతుండగా, అలాంటి ఘటననే ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ స్నేహితులతో కలిసి భర్తను, అత్తను హత్య చేసి.. వారి మృతదేహాలను ముక్కలుగా కోసి ఫ్రిజ్లో దాచిపెట్టింది. అనంతరం పొరుగు రాష్ట్రంలోకి తీసుకెళ్లి అక్కడ లోయలో విసిరేసింది. అత్యంత భయంకరమైన ఈ ఘటన అసోంలో గతేడాది చోటుచేసుకోగా.. ఏడు నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గువాహటిలో చోటుచేసుకున్న ఈ జంట హత్యలకు సంబంధించి కొన్ని శరీర భాగాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గువాహటికి చెందిన అమర్జ్యోతి డే, వందన కలితలది ప్రేమ వివాహం. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరికి అమర్ తల్లి శంకరీ డే ఆర్థికసాయం చేశారు. కొన్నాళ్లు సాఫీగా సాగినా.. ఆమె నుంచి ఆర్ధిక సాయం ఆగిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. తన భర్త, అత్తలు కనిపించడం లేదంటూ గత సెప్టెంబరులో పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులను అమరేంద్ర బంధువు ఒకరు సంప్రదించి.. అత్త శంకరీ డే బ్యాంకు ఖాతా నుంచి వందన డబ్బులు డ్రా చేసిందని ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కళ్లుబైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. తన స్నేహితులతో కలిసి భర్త, అత్తలను ఆమే హత్య చేసినట్టు వెల్లడయ్యింది.