ISIS – IIT Student : ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ మన దేశంలో యువతను రిక్రూట్మెంట్ చేసుకునేందుకు కుట్ర చేసింది. అమాయక యువకులను మాయ చేసి తమ ఉగ్ర సంస్థలో చేర్చుకునేందుకు ఐసిస్ పన్నాగాలు పన్నుతోంది. తాజాగా అసోంలోని ఐఐటీ గువహటిలో చదువుతున్న ఓ విద్యార్థిని తమ ఉగ్ర సంస్థలో చేర్చుకునేందుకు ఐసిస్ ప్లాన్ చేసింది. అయితే ఈ సమాచారం భారత నిఘా వర్గాలకు అందింది. దీంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు అసోంలోని కమ్రూప్ జిల్లాలో ఉన్న హజో పట్టణంలో సదరు ఐఐటీ విద్యార్థిని అరెస్ట్ చేశాయి. ఈవిషయాన్ని అసోం డీజీసీ జీపీ సింగ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. ఐఐటీ గువహటికి చెందిన ఓ విద్యార్థి ఐసిస్లో చేరేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. తదుపరిగా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందిన విద్యార్థి ప్రస్తుతం ఐఐటీ గువహటిలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతడు ఐసిస్కు ఆకర్షితుడయ్యాడు. తాను ఐసిస్లో చేరేందుకు వెళ్తున్నట్టు సదరు విద్యార్థి ఒక మెయిల్ చేశాడు. దాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే ఎంక్వైరీని ప్రారంభించారు. విద్యార్థి ఆచూకీని తెలుసుకునేందుకు ఐఐటీ గువహటి అధికారులను సంప్రదించారు. అప్పటికే విద్యార్థి కనిపించకుండా పోవడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఆ విద్యార్థి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు.ముమ్మరంగా గాలించిన పోలీసులు శనివారం రాత్రి హజో పట్టణం సమీపంలో సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి(ISIS – IIT Student) హాస్టల్ గదిలోనూ ఐసిస్ నల్ల జెండాలు ఉన్నాయని గుర్తించారు.
ఇటీవలే బంగ్లాదేశ్లోని ధుబ్రీ జిల్లా నుంచి అసోం బార్డర్లోకి ప్రవేశిస్తున్న ఐసిస్ ఇండియా హెడ్ హరీస్ ఫరూఖీ, అతడి సహచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రహ్మాన్లను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) ధర్మశాల దగ్గర వారిని పట్టుకుంది. వీరిద్దరు కలిసి ఐసిస్లో దేశమంతా రిక్రూట్మెంట్, ఫండింగ్, టెర్రర్ చర్యలను చేపట్టే పనిలో ఉన్నారని గుర్తించారు. ఈ ఇద్దరిపై ఎన్ఐఏ, ఢిల్లీ, ఏటీఎస్, లక్నో తదితర ప్రాంతాల్లో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు.