24 Lakh Affected: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 24 లక్షల మందికిపైగా ప్రజానీకం(24 Lakh Affected) ప్రభావితం అయ్యారు. వరదల కారణంగా దిస్పూర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి గాయాలయ్యాయి. దీంతో తాజా వర్షాకాల సీజనులో ఇప్పటివరకు అసోం వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 64కు పెరిగింది. ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. వరదల వల్ల దాదాపు 3,512 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 63,490 హెక్టార్లలో పంటలు మునిగిపోయాయి. ఈవివరాలను అసోం విపత్తు నిర్వహణ విభాగం కూడా ధ్రువీకరించింది.
We’re now on WhatsApp. Click to Join
వరదల వల్ల అసోంలోని ధుబ్రి జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడి దాదాపు 7 లక్షల మందికిపైగా ప్రజలు వరద ముంపు సమస్యను ఎదుర్కొన్నారు. దర్రాంగ్ జిల్లాలో 1.86 లక్షల మంది, క్యాచర్ జిల్లాలో 1.75 లక్షల మంది, మోరిగావ్లో 1.46 లక్షల మంది, బార్పేట జిల్లాలో 1.40 లక్షల మంది వరదలతో ప్రభావితం అయ్యారు.వరదల వల్ల అసోం రాష్ట్రంలోని దాదాపు 220కిపైగా రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు 10 వంతెనలు కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో.. పలు జిల్లాలు గత కొన్ని రోజులుగా అంధకారంలో మగ్గుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాలకు(assam floods) చెందిన దాదాపు 47,103 మందిని అసోం రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ టీమ్స్ 612 పునరావాస కేంద్రాల్లో చేర్చాయి. వారు అక్కడ సురక్షితంగా తాత్కాలిక ఆవాసం పొందారు. వారికి ఆహారం, మందులను పంపిణీ చేస్తున్నారు. వరదల బీభత్సంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటించి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇక వరదల వల్ల అసోంలోని పశు సంపదకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 15.28 లక్షలకుపైగా పశుసంపద అనేది వరదలతో ప్రభావితం అయింది. 84 జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. కజిరంగా జాతీయ పార్కులో 77 వన్యప్రాణులు చనిపోయాయి.