Tea Man : అతడి పేరు అశోక్ సాహ్ని. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుర నివాసి. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కరుడుగట్టిన ఫ్యాన్. ఎప్పటికైనా తన చెయ్యితో ప్రధాని మోడీకి టీని అందించాలనేది ఆయన చిరకాల వాంఛ. దీన్ని నెరవేర్చుకునే అవకాశం దక్కుతుందేమో అన్న ఆశతో బిహార్, ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభ ఎక్కడ జరిగితే అక్కడికి గత ఏడేళ్లుగా అశోక్ వెళ్తున్నాడు. ప్రత్యేకంగా టీని తయారు చేసి తనతో పాటు ఆయా మీటింగులకు హాజరవుతున్నాడు.తాజాగా ఇవాళ బిహార్లోని జముయిలో జరిగే సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సభకు కూడా ముజఫర్పూర్ నుంచి అశోక్ తన టీ మేకింగ్ సెటప్ సమేతంగా వెళ్లాడు. ప్రధాని మోడీకి టీ సర్వ్ చేసే అవకాశం దొరకకపోయినా ఆయన ఏ మాత్రం నిరాశకు గురికావడం లేదు. ఆయా సభలకు హాజరయ్యే మోడీ ఫ్యాన్స్కు టీని సర్వ్ చేసి మనసుకు సర్ది చెప్పుకుంటున్నాడు. ఏదో ఒకరోజు తప్పకుండా ప్రధాని మోడీకి టీని చేతులతో అందించే అవకాశం దక్కుతుందనే ఆశతో అశోక్(Tea Man) జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల కాలంలో ప్రధాని మోడీ సభలు జరిగిన ఢిల్లీ, అయోధ్య, కాన్పూర్, జార్ఖండ్, మోతీహరి, బెట్టియాలకు కూడా అశోక్ వెళ్లొచ్చాడు. తన శరీరంపై ప్రధాని మోడీ ముఖ చిత్రాన్ని పెయింట్ వేయించుకొని సభలకు హాజరుకావడం అతడి ప్రత్యేకత. సాధారణంగానైతే అశోక్ తన శరీరంపై మోడీ ఫొటోతో పాటు నమో నమో అనే నినాదాన్ని రాయించుకుంటాడు. ఇవాళ బిహార్లోని జముయిలో జరుగుతున్న సభకు మాత్రం ‘ఇస్ బార్ 400 పార్’ అని రాయించుకొని వచ్చాడు. ఈసారి బీజేపీ 400 లోక్సభ సీట్లను గెలవాలనే తన ఆకాంక్షను తద్వారా అశోక్ వ్యక్తపరిచాడు.
అశోక్ సాహ్ని కెటిల్, టీ తయారీ పాత్రలను చేతిలో పెట్టుకొని.. ప్రధాని మోడీ సభల్లో పాల్గొంటాడు. అతడు వాడే టీ తయారీ స్టవ్పై వందేమాతరం, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలు ఉంటాయి. ఇప్పటి వరకు దేశంలో ప్రధాని మోడీ లాంటి గొప్ప నాయకుడు తనకు కనిపించలేదని అశోక్ చెప్పారు. రాజకీయ నాయకులందరూ తమతమ కుటుంబాల గురించే ఆలోచిస్తారని.. కానీ మోడీ దేశం గురించే ఆలోచిస్తారని ఆయన అన్నారు. అందుకే తాను మోడీకి ఫ్యాన్గా మారిపోయానని అశోక్ తెలిపారు.