Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case) లో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీ వ్యక్తిగత కార్యదర్శి (Private Secretary) బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై వేటు పడింది. అతని నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్ (Directorate of Vigilance) వెల్లడించింది. ఈ మేరకు బిభవ్ను విధుల నుంచి తొలగించింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని బిభవ్పై 2007లో నోయిడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అతడు కేజ్రీవాల్కు పర్సనల్ సెక్రటరీగా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. ఈ నియామకంలో అవకతవకలు జరిగాయని గుర్తించినట్లు పేర్కొంది. పాలనావ్యవహారాల పరంగా ఇది ఇబ్బందికర పరిణామం అని, ఎలాంటి ముందస్తు వెరిఫికేషన్ లేకుండా మంత్రుల వ్యక్తిగత సిబ్బందిని నియమించడం సరికాదని విజిలెన్స్ విభాగం తెలిపింది. బిభవ్పై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, వాటిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిభవ్ కుమార్ను ఈడీ అధికారులు సోమవారం విచారించిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ యాక్ట్ కింద అతడి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఈడీ విచారణ అయిన మూడు రోజులకే బిభవ్ను విధుల నుంచి తొలగించడం గమనార్హం.
బిభవ్పై వేటు వేడయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందించింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తమ పార్టీని అన్ని విధాలా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించింది. తొలుత తప్పుడు కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి సహా ఆయన సిబ్బంది మొత్తాన్ని తొలగించే పనిలో పడ్డారని మండిపడింది.