Arvind Kejriwal: ‘ఇండియా’కు కేజ్రీవాల్ షాక్, త్వరలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన

  • Written By:
  • Updated On - February 10, 2024 / 10:39 PM IST

Arvind Kejriwal: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ  ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఉన్నట్లుండి ఈ కూటమి నుంచి వైదొలిగారు. అటు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుని.. కూటమికి దిమ్మతిరిగే షాకిచ్చారు.పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఈ ప్రకటనతో క్లారిటీ ఇచ్చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, చండీగఢ్‌లోని 1 స్థానంలో ఆప్ పోటీ చేస్తుంది’’ అని చెప్పారు. ఇప్పటికే నితీశ్ కుమార్ కూటమి నుంచి వెళ్లిపోవడం, పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ చేసిన ప్రకటనలతో ఇండియా కూటమి విలవిల్లాడుతోంది. ఈ పరిస్థితి ఎలా అధిగమించాలా? అని ఆలోచనిస్తున్న తరుణంలో.. కేజ్రీవాల్ చేసిన తాజా ప్రకటన మరింత గందరగోళాన్ని పెంచింది.

ఈ దెబ్బతో ఇండియా కూటమి మరింత బలహీనతంగా తయారవుతుందని చెప్పుకోవడంలో సందేహం లేదు.అటు.. ఉత్తరప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ రాష్ట్రంలో ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం అయితే కుదిరింది. కానీ.. ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయిన జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్.. ఎన్డీఏతో చేతులు కలపనున్నట్టు బలమైన ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.