Site icon HashtagU Telugu

Gujarat : గుజరాత్ లో టాటా సహకారంతో 22వేల కోట్ల ఎయిర్ బస్ ప్రాజెక్టు..!!

Unmanned Aircraft

Unmanned Aircraft

అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కు మరో భారీ బహుమతి లభించింది. వడోదరలోని ఎయిర్ బస్ సి-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 30 జరగతుందని…ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. తొలిసారిగా సి-295 విమానాలను యూరప్ లో కాకుండా బయట తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. దీని కోసం ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తో సుమారు రూ. 21,000కోట్లు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు కింద మిలిటరీ విమానాలను తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ భారత్ లో తయారు చేయనుంది.

భారత్ లో ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయడం ఇదే మొదటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 21.935కోట్లు. ఈ విమానాన్ని పౌర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని డిఫెన్స్ సెక్రటరీ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్ బస్ ఫ్లైట్ కండిషన్ లో ఉన్న మొదటి 16 ఎయిర్ క్రాప్ట్ లను స్పెయిన్ లోని సెవిల్లేలోని చివరి అసెంబ్లీ లైన్ నుంచి నాలుగేళ్లలో సరఫరా చేయనుంది. తర్వాత 40 విమానాలను భారత్ లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసి అసెంబుల్ చేస్తుంది. రెండు కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్మాణం జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి రెగ్యులేటరీ అనుమతిని గతవారం డైరెక్టేరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ మంజూరు చేసింది.