Site icon HashtagU Telugu

యూపీ బీజేపీకి ‘అమూల్‌’ చిచ్చు

ఎక్కడికైనా దేశప్రధాని వస్తుంటే.. ఆనందపడతారు. కానీ, యూపీలోని కరియాన్వ్‌లో మాత్రం రైతులు ఆగ్రహంగా ఉన్నారు. భూపరిహారం ఇవ్వకుండా అమూల్‌ ప్లాంట్‌ శంకుస్థాపన చేస్తారా..!? అంటూ నిలదీస్తున్నారు. ఈనెల 23న ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టు రైతుల‌కు, యూపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య అగాధం పెంచుతోంది.బనారస్‌లోని కరియాన్వ్‌లో అమూల్‌ డెయిరీ ప్లాంట్ కోసం భూమి సేకరణ జరిగింది. దానికి ఇంకా పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చామని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సీఐడీఏ) పేర్కొంటుంది. భూపరిహారం అందకపోవడంతో పలువురు రైతుల కుమార్తెలకు పెండ్లిండ్లు చేయటానికి పైసల్లేక నానా అవస్థలు పడుతున్నారు.బనారస్‌ నుంచి 30 కి.మీ.ల దూరంలో జౌన్‌పూర్‌ సరిహద్దులో ఉన్న ఆగ్రో పార్క్‌లో అమూల్‌ డైరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2000లో ఈ ప్లాట్‌ కోసం భూమిని సేకరించారు. అయితే తర్వాత పరిహారం విషయంలో చిక్కుముడి పడింది. అమూల్‌ ప్లాంట్‌, ఇతర సంస్థల కోసం ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ ఇండిస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూమిని సేకరించిన రైతులలో కరియాన్వ్‌, బిందా, ట్రంపెట్‌, భుస్‌ లీ, కేహర్‌, ఫుల్‌పురి, థారి, కుసాన్‌ , డీఘీ ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఉన్నారు.

భూమికి పరిహారం చాలా తక్కువగా ఉండడంతో వంద మందికి పైగా రైతులు జిల్లా, సెషన్స్‌ కోర్టులో ల్యాండ్‌ రెఫరెన్స్‌ (ఎల్‌ఏఆర్‌) దాఖలు చేశారు. రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, పెరిగిన ధరల ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సీఐడీఏను కోర్టు ఆదేశించింది. ఇందుకు అథారిటీ సిద్ధంగా లేకపోవడంతో వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది.
అలహాబాద్‌ హైకోర్టు రైతులకనుకూలంగా 2018 ఏప్రిల్‌ 16న తీర్పు వెలువరిస్తూ ఒక్కో డిస్మిల్‌కు రూ.5100, రూ.4760 చొప్పున రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ రైతుల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలుమార్లు అధికారులు, రైతుల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. పరిహారం ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. నష్టపరిహారం సొమ్ము తమ ఖాతాల్లో పడేదాకా భూమిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.మరోవైపు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (లోశక్తి) జిల్లా అధ్యక్షుడు ధనంజరు సింగ్‌తో సహా పలువురు రైతులను గూండా చట్టం కింద అరెస్టు చేశారు. అయినా రైతుల వెనక్కి తగ్గలేదు. కాగా, రైతులకు ఎక్కువ నష్టపరిహారం చెల్లించనందుకు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సిడా) సుప్రీంకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. 4 ఆగస్టు 2021న అలహాబాద్‌ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ, పెరిగిన ధరల ప్రకారం రైతులకు పరిహారం మొత్తాన్ని చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

భూపరిహారం సొమ్ము ఖాతాలోకి రాకముందే బనారస్‌ కలెక్టర్‌ కౌశల్‌రాజ్‌ శర్మ భారీగా పోలీసులు మోహరించారు. బలవంతంగా కారియాన్వ్‌ చేరుకున్నారు. రైతుల పొలాల్లో వేసిన వరిపంట మొత్తాన్ని జేసీబీతో తొక్కి మా భూములను బలవంతంగా ఆక్రమించుకున్నారు. పంట నష్టపరిహారం చెల్లించకుండా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సంఘటన 21 ఆగస్టు 2021 న జరిగింది. గత మూడు నెలలుగా కారియాన్వ్‌లోని ఆగ్రో పార్క్‌లో పోలీసుల పర్యవేక్షణలో రైతుల భూముల హద్దులు నిర్వహిస్తున్నారు. అమూల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే స్థలంలో జాన్‌ పూర్‌ నుంచి మట్టిని తీసుకొచ్చి భూమిని నింపుతున్నారు. 16 డిసెంబర్‌ 2021 వరకు ఆగ్రో పార్ట్‌లో పీఏసీ సిబ్బందిని నియమించారు. డిసెంబర్‌ 14 రాత్రి.. ఆవాలపంట ఉన్న భూముల్లో అధికారులు దున్నటంతో..రైతులు రగిలిపోయారు.రైతు నాయకుడు ధనుంజరును అరెస్టు చేశాక.. పెద్ద సంఖ్యలో ప్రజలు ఫుల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఘెరావ్‌ చేశారు. అతన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పూల్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో రాజారాం అనే రైతు పాదాల ఎముకలు విరిగిపోయాయి. అరడజను మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయి.

బీహార్‌లో ‘సుధ’ బ్రాండ్‌ పేరుతో పాలను విక్రయించే పాల సహకార సంఘం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ డెయిరీ సంస్థ అయిన పరాగ్‌ను అధిగమించింది. దీన్ని నెమ్మదిగా ప్రయివేటుపరం చేసేదిశగా.. గుజరాత్‌లోని అమూల్‌ను ఇక్కడ నెలకొల్పబోతుండటంతో పాల సొసైటీలు ఆక్షేపిస్తున్నాయి. ప్రధాని తలుచుకుంటే ఏమైనా చేయగలరనీ, అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో భూపరిహారం కోసం పోరాడుతున్న రైతులు, ప్రయివేట్‌ చేతుల్లోకి వెళ్లే పాల సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఐదు లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే అమూల్‌ డెయిరీ ప్లాంట్‌కు డిసెంబర్‌ 23న కార్కియాన్‌ ఆగ్రో పార్క్‌లో శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ ప్రాజెక్టు 15 నుంచి 18 నెలల్లో సిద్ధం కాబోతోంది. దాదాపు 32 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అమూల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో పూర్వాంచల్‌కు చెందిన ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందనీ.. అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ ప్లాంట్‌తో బనారస్‌లో యువతకు ఉపాధి కల్పించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి అమూల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తున్నారు. అయితే, రైతుల‌కు ప‌రిహారం చెల్లించ‌క‌పోవ‌డంతో మ‌రో రైతు ఉద్య‌మం బీజేపీని వెంటాడుతోంది.