చైనాకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉయ్ఘర్ ముస్లింలపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇప్పటికే 2022బీజింగ్ ఒలంపిక్స్ ను దౌత్యపరంగా నిషేధించిన అమెరికా తాజాగా ఈ ఆంక్షలు విధించింది.
చైనా మిలిటరీకి అనుబంధ సంస్థ అయిన చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్, దాని 11 పరిశోధన సంస్థలు లక్ష్యంగా అమెరికా వాణిజ్య విభాగం ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఉయ్ఘర్లను అణచివేసేందుకు జిన్జియాంగ్ రాష్ట్రంలో చైనా ప్రత్యేక నిఘా పెట్టిందని అమెరికా ఆరోపించింది. బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ ద్వారా 12 నుంచి 65 ఏళ్ల మధ్య వారి డీఎన్ఏను సేకరిస్తున్నట్లు తమ నిఘా వర్గాల దృష్టికి వచ్చిందని.. అందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధికారిక వర్గాలు వివరించాయి. జిన్జియాంగ్ ప్రాంతంలోని ప్రజలతో చైనా బలవంతపు చాకిరీ చేయించుకుంటోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిన్జియాంగ్ రాష్ట్రం నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు సెనేట్ గురువారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడం ఇక లాంఛనప్రాయమే.