Delimitation : సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చించేందుకు తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Read Also: PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుంది. మన సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతాం అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్పై ఈ అఖిలపక్ష భేటీ చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ప్రస్తుతమున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్లో మన ప్రాతినిధ్యం పడిపోతే.. అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుంది. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయబద్ధంగా, పారదర్శంగా డీలిమిటేషన్ చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్ లభించలేదు సరికదా.. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డాం అని అన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కొన్ని దశాబ్దాలుగా పలు దక్షిణాది రాష్ట్రాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం అనేక విధానాలు కూడా తీసుకొచ్చాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనాభా వృద్ధి విపరీతంగా ఉందన్నారు.